న్యూఢిల్లీ: ఆశించిన దానికంటే అధికంగా లాభాలు రావడంతో ఎనిమిది నెలల జీతానికి సమానమైన మొత్తాన్ని బోనస్గా ఇవ్వాలని సింగపూర్ ఎయిర్లైన్స్ (Singapore Airlines) నిర్ణయించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆ విమానయాన సంస్థ రికార్డు స్థాయిలో 1.98 బిలియన్ డాలర్ల నికర లాభం ఆర్జించింది. దీంతో లాభాల్లో కొంత భాగాన్ని ఉద్యోగులకు బోనస్ రూపంలో చెల్లించనున్నట్లు సంస్థ ప్రకటించింది. కరోనా మహమ్మారి వల్ల మూతపడిన చైనా, హాంకాంగ్, జపాన్, తైవాన్ సరిహద్దులు ఏడాది క్రితం పూర్తిస్థాయిలో తెరచుకోవడంతో ఇది సాధ్యమైందని ఎయిర్లైన్ ఆర్థిక నివేదిక వెల్లడించింది. ఏడాది పొడవున విమాన ప్రయాణాలకు డిమాండ్ ఏర్పడిందని పేర్కొంది.
గతేడాది సింగపూర్ ఎయిర్వేస్ ప్రపంచంలోనే అత్యుత్తమ విమానయాన సంస్థగా ది స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్లైన్ అవార్డును సొతం చేసుకుంది. దీంతో గత 23 ఏండ్లలో సింగపూర్ ఈ పురస్కారన్ని గెలుచుకోవడం ఇది ఆరోసారి. ఉద్యోగుల అవిశ్రాంత కృషి ఫలితంగానే ఈ అవార్డు దక్కిందని సింగపూర్ ఎయిర్లైన్స్ సీఈఓ గో చూన్ ఫాంగ్ అన్నారు. ఎయిర్ ట్రావెల్లో మరింత పుంజుకోవడానికి ఇది సహాయపడుతుందని చెప్పారు. కాగా, ఎమిరేట్స్ గ్రూప్ కూడా తమ ఉద్యోగులకు 20 వారాల జీతాన్ని బోనస్గా ప్రకటించింది. మే నెల జీతాలతో ఈ మొత్తాన్ని చెల్లించనున్నట్లు వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో లాభాలు ఆర్జించినట్లు తెలిపింది.